న్యూఢిల్లీ : కరోనా వైరస్(కోవిడ్-19) పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇటీవల భారత్లోనూ ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్ అనతి కాలంలోనే తన పంజా విసురుతోంది. తాజాగా గురువారం నోయిడాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కి చేరింది. నోయిడా నగరానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన ఆగ్రా, జైపూర్ నగరాలు కూడా చుట్టి వచ్చిన ఇటలీ బృందానికి సేవలదించారు.
ఇటలీ దేశస్థులతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా వ్యాప్తి చెందినట్లు తేలిందని ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్ఠర్ అనురాగ్ భార్గవ తెలిపారు. ప్రస్తుతం అతన్ని ఢిల్లీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వ్యక్తికి కరోనా సోకిందని తేలడంతో ఆయన ముగ్గురు కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాల సేకరించి పూణేలోని నేషనల్ వైరాలజీ సెంటర్కు పంపించామని తెలిపారు.
కాగా బుధవారం కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని నివారించడానికి అసాధారణమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలను కోరింది. ఇప్పటి వరకు కేరళలో కేరళలో 17 కేసులు, హర్యానాలో 14, మహారాష్ట్రలో 11, యూపీలో 9, ఢిల్లీలో 5, కర్ణాటకలో 4, రాజస్థాన్ లో 3, లఢఖ్ లో 2 కేసులు వెలుగుచూశాయి. దీంతోపాటు తెలంగాణ, పంజాబ్, జమ్మూకశ్మీర్, తమిళనాడులలో ఒక్కో కేసు నమోదైంది.